మళ్ళీ నానా పటేకర్ పై మరోసారి విరుచుకుపడిన తను శ్రీ దత్తా.. విషయం ఇదే!

బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా – నానా పటేకర్ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నానాపటేకర్ పై తను శ్రీ లైంగిక ఆరోపణలు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలం సృష్టించాయో మీకు తెలియంది కాదు. ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ అప్పట్లో చేసిన ఆరోపణలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు తను శ్రీకి మద్దతుగా నిలవడం… నానా పటేకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం కూడా తెలిసిన కధే.

కాగా తాజాగా మరోసారి నానా పటేకర్ ని ఉద్దేశించి తనుశ్రీ తన ఇన్ స్టా వేదికగా సంచలన పోస్ట్ చేసింది. అదేమిటంటే… “జీవితంలో నాకు ఏదైనా జరిగితే దానికి నానా పటేకర్ బాధ్యుడు అవుతాడు. నాకు ఏమైనా జరిగితే దానికి కారణం అతని లాయర్, సన్నిహితులు.. బాలీవుడ్ లో సో కాల్డ్ ప్రముఖులు అని అందరు తెలుసుకోండి. సుషాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో బయటకి వచ్చిన పేర్లే బాలీవుడ్ మాఫియాలో ఉంటాయి. వీరందరికీ ఒకే లాయర్ కామన్ గా ఉంటాడు.” అని చెప్పింది.

తనుశ్రీ ఇంకా అందులో పేర్కొన్న విషయం ఏమంటే.. “దయచేసి ఇలాంటివారిని ఇండస్ర్టీ నుంచి వెళ్ళగొట్టండి. కొంత మంది పరిశ్రమ వ్యక్తులు.. జర్నలిస్ట్ లు.. PR టీమ్ ఇప్పటికీ నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. చట్టం.. న్యాయం.. నాకు వ్యతిరేకంగా పనిచేయోచ్చు. కానీ దేశ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. వారిని ఎవరూ విడిచి పెట్టకండి. మరోసారి మళ్లీ కలుద్దాం!” అని ఎంతో ఉద్వేగంగా ఆ పోస్ట్ ముగించింది. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వివాదం తెరపైకి వచ్చి నాలుగేళ్లు కాగా, తాజాగా అదే విషయాన్ని తనుశ్రీ ఎందుకు తెరపైకి తీసుకువచ్చింది అని ఆలోచిస్తున్నారు.